హేతువాదం ఎప్పుడు ప్రారంభమైంది?
మానవవాదాలు ఎప్పటివి?
2 లక్షల సంవత్సరాల క్రితం ఆధునిక ఆలోచించగల మానవుడు హేతుబద్ధ చింతన చేయగల ఉత్తమ పరిణతి పొందిన మెదడుతో ఆవిర్భవించాడు.
చేపల ఆవిర్భావం నుంచి చూసినా మెదడు పరిణామ వయసు దాదాపు 40 కోట్ల సంవత్సరాలకు పైనే.
40 కోట్ల సంవత్సరాల కాల గమనంలో జీవుల పరిణామంలో చేపల మెదడు మానవ మెదడుగా పరిణమించింది.
చేపల మెదడు నిర్మాణం , పని విధానం కంటే మానవ మెదడు నిర్మాణం , పని విధానం ఉత్తమ మైనది.
ఎర వేసి చేపను పట్ట గల హేతుబద్ధ చింతన మానవుడిది.
జీవులన్నింటిలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో పరిసరాలను గమనించడం, వాటికి ప్రతిస్పందించడం వివిధ స్థాయిల్లో సాధారణ విషయమే.
నాడీ కణాల ఆవిర్భావం, అవి మెదడుగా రూపధారణ, మెదడు భాగాల టీం వర్క్ క్రమంగా పరిణతి పొంది ఆయా జీవుల మనుగడను పెంచాయి.
2 లక్షల సంవత్సరాల క్రితం మానవుడికి హేతుబద్ధంగా ఆలోచించగల, ప్రశ్నించగల, పరికల్పించగల, విశ్లేషించగల,సత్య నిర్ధారణ చేయగల మెదడు లభించింది.
అయితే ,ఆనాటి మానవుడి జ్ఞానం చాల అల్పం.
తరతరాలుగా మానవులు పొందిన జ్ఞానం సంచితంగా పోగుబడి తర్వాత తరాలకు అందడంతో క్రమంగా జ్ఞానమే శక్తిగా మారి మానవుడు శక్తివంతుడై జీవ ప్రపంచాన్ని జయించాడు.
క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన జ్ఞానం, అవగాహనలు ఆదిమ మానవుడి మెదడుకు పదును పెట్టి ఈనాటి మానవుడి మెదడుగా అధిక శక్తివంతం చేశాయి.
భాష లేకపోయినా హేతుబద్ధ ఆలోచనా విధానంతో తొలి మానవుడు తన జీవితాన్ని ప్రారంభించాడు.
అందువల్ల , మానవుడు తొలి నుంచీ హేతుబద్ధ చింతన చేయగలిగి, వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుని , అమలు చేసి తన అభివృద్ధి కి ఆలోచిస్తూ, శ్రమిస్తూ ముందుకు సాగిన ఫలితమే ఈనాటి మనం.
తరతరాల మానవుడి స్ఫూర్తి కొనసాగవలశిందే.
ఎన్నో రాజకీయ, ఆర్ధిక ,సామాజిక ,సాంస్కృతిక సమస్యలు పరిష్కారం కొరకు మానవుడి హేతుబద్ధ చింతనకై ఎదురు చూస్తున్నాయి.
మానవుడు ఈ భూమి చుట్టూ ఉన్నంత కాలం హేతువాదం, మానవవాదాలు మానవుడితో కొనసాగుతూనే ఉంటాయి.
అందుకే యం.యన్. రాయ్ అంటాడు," మానవజాతి ఎంత పురాతనమో మానవవాదం అంత పురాతనమైనది" అని.
Comments
Post a Comment