నికోలస్ కోపర్నికస్ జయంతి
మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. శాస్త్రీయంగా సూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని నిరూపిస్తూ సిద్ధాంతీకరించిన నికోలస్ కోపర్నికస్ జయంతి పిబ్రవరి 19. కోపర్నికస్ గురించి క్లుప్తంగా....కె కె వి నాయుడు.
ఫిబ్రవరి 19 ,1473 లో ధార్న్ అనే పట్టణంలో కోపర్నికస్ జన్మీంచాడు. తండ్రి వర్తక వాణిజ్య పరిజ్ఞానము,పినతండ్రి మత సంబంధమైన వ్యవహార జ్ఞానము కోపర్నికస్ పై బాగా ప్రభావాన్ని చూపాయి. 1492 లో ఈయన క్రాకోవ్ విశ్వ విద్యాలయంలో చేరాడు. ఆల్బెర్ట్ బ్రుడ్జ్ విస్కీ దగ్గర శిష్యరిక నెరిపాడు. ఇటలీలో బొలోగ్నావిశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం,గణిత శాస్త్రము, ఖగోళశాస్త్రము అభ్యసించాడు. గ్రీకు భాష నేర్చుకుని ఎన్నో గ్రంథాలను కంఠస్థం చేశాడు.
రోమ్ విశ్వవిద్యాలయంలో 29 ఏళ్ళ వయస్సులో 1502 లో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరాడు. విశ్వానికి కేంద్రం భూమి,సూర్యుడు, ఈ రెంటిలో ఏది? అనే అనుమానం పట్టుకుంది. అరిస్టాటిల్, టోలెమీకు భూ కేంద్రక సిద్ధాంతం బలపరి చారు. పైథాగరస్ సూర్య కేంద్రక సిద్ధాంతమే సరి అయిందని నమ్మాడు. ఏది నమ్మాలో,ఏది నమ్మకూడదో కోపర్నికస్ కు అర్థం కాలేదు. ఈ విషయం పై ఆలోచిస్తూ రాజీనామా చేసి ప్రోవెన్ బర్గ్ లో కానన్ అనే మతాధికారిగా చేరాడు.
వైద్యునిగా ఎంతో పతిష్ట నార్జించాడు. న్యాయమూర్తిగా రాణించాడు.క్లిష్ట సమయాలలో సలహాలనిచ్చి పోలెండ్ ఆర్థిక దుస్థితిని తొలగించాడు.పోప్ అభ్యర్థన మేరకు పంచాంగాన్ని సరి చేసి ఖగోళ శాస్త్రజ్ఞునిగా తిరుగులేదని పించుకున్నాడు.
తరువాత గణిత శాస్త్రజ్ఞులు లెక్కలు వేసి కోపర్నికస్ కట్టిన లెక్కలు కచ్చితమైనవని సంవత్సర కాలంలో 28 సెకన్లు మాత్రమే తేడా వస్తుందని చెప్పారు.
క్రీ.శ 1520 లో అల్లెన్ స్టెయిన్ కాసిల్ కు గవర్నర్ గా కూడా పనిచేసి ట్యూటానిక్ వీరులను ఎదుర్కొన్నాడు.ఈ విధంగా ప్రజా సేవ, మత సేవ చేస్తున్నప్పటికీ శాస్త్ర సేవ మాత్రం మానలేదు.
సూర్యకేంద్ర సిద్ధాంతాల నమూనాలను, సిద్ధాంతాలను, ఇతని కంటే ఎన్నో వందల ఏండ్లకు మునుపే ఆర్యభట్టు, ఒమర్ ఖయ్యాం లు, ప్రతిపాదించారు, కాని, గ్రహాల కదలికలు ఆధారముగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదట నిరూపించింది ఇతనే.
భూమి తన అక్షము పైనే తిరుగుతుందని అందువాల్లే రాత్రి పగలూ యేర్పడుతున్నాయని తెలిపాడు.భూబ్రమణ,పరిభ్రమణాల వల్లే శీతోష్ణ స్థితులు, ఋతువులు మారుతున్నాయని గ్రహించాడు. ఈ విషయాలన్నీ వాస్తవాలే అయినా వాటిని బయట పెట్టడానికి కోపర్నికస్ కు ధైర్యం చాలలేదు.ఎందువలననగా అప్పట్లో ఎవరూ ఇతన్ని నమ్మలేదు.
మత గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలలో సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని వ్రాసి ఉంది.
"ఖగోళ శాస్త్రాన్నే తలక్రిందులుగా చేస్తున్న మూర్ఖుడు కోపర్నికస్" అని మార్టిన్ లూథర్ దూషించాడు కూడా.
అయినప్పటికీ కోపర్నికస్ అంతిమ దశలో తాను సేకరించిన, తెలుసుకున్న వివరాలన్నింటిని గ్రంథంగా అచ్చు వేయించి పోప్ గా ఉన్న మూడవ పాల్ కు అంకితం చేశాడు.
ఇది జర్మనీలో ఉన్న న్యూవెంబర్గ్ లో ప్రచురితమయినది. ఈ పుస్తకంలోని అంశాలు సంఘ విద్రోహాన్ని సూచిస్తాయేమోనన్న భయంతో ప్రచురన కర్తలు "దీనిని విజ్ఞాన గ్రంధంగా పరిగణించ గూడదు" అని ముందుగానే చెప్పుకున్నాయి. కాని ఈ విషయం తెలియకుండానే 1543 మే 21 లో కోపర్నికస్ కన్ను మూశాడు.
కోపర్నికస్ కంటే కొన్ని శతాబ్దాల ముందు ఎంతోమంది భారతీయ, గ్రీకు మరియు ముస్లిం శాస్త్రవేత్తలు సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని గురించి ప్రస్తావించినా ఇతని రచనల్లో సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని సైద్ధాంతికంగా నిరూపించడంతో ప్రాధాన్యం సంతరించుకున్నాడు.
దీంతో ఆధునిక సైన్సులో కోపర్నికస్ విప్లవం ఆరంభమైంది. కోపర్నికస్ అందించిన ఈ వివరాలె తరువాత రంగంలోకి దిగిన టైకో బాహ్రి, కెప్లర్, గెలీలియో, న్యూటన్,ఐన్ స్టీన్ వంటి మహా మహులకు పునాది రాళ్ళుగా నిలిచాయి.....
Comments
Post a Comment