ప్రముఖ శాస్త్రవేత్తల జయంతులు,వర్ధంతులకు ప్రాధాన్యత
గెలిలియో స్పూర్తితో
రచయిత-యమ్.రాం ప్రదీప్
సాధారణంగా సంఘ సంస్కర్తలకి,స్వాతంత్ర సమర యోధులకి ఉన్న ప్రాధాన్యత క్షేత్ర స్థాయిలో శాస్త్రవేత్తలకి లభించడం లేదు.కనీసం విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రముఖ శాస్త్రవేత్తల జయంతులు,వర్ధంతులు జరపడం లేదు.పాఠశాలల్లో వివిధ పండుగల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.శాస్త్రవేత్తల గురించి పరిచయం చేసే సందర్భాలు విద్యాలయాల్లో చాలా అరుదు.వారి విగ్రహాలు కూడా ఎక్కడా పెద్దగా కనిపించవు.ఎందరో శాస్త్రవేత్తలు తమ ప్రాణాలని సైతం త్యాగం చేసి అనేక విషయాలు కనుగొన్నారు.అటువంటి వారిలో గెలిలియో ఒకరు.
గెలిలియో తన పరిశోధనలతో ఖగోళ శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించారు.ఆయన కోపర్ని కస్ ప్రతిపాదించిన సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని బలపరిచాడు.గురు,శనిగ్రహాల పై పరిశోధన చేసాడు.గెలీలియో ఎన్నో మూఢ నమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించ గలిగాడు. 20 సంవత్సరాల వయస్సప్పుడు ఈయన ఒక రోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుండి వ్రేలాడుతూ ఉన్నాయి. ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు, యిటూ ఊగటం గమనించాడు. వాటి డోలనా సమయాలు ఒకటేనని లెక్క వేశాడు. గెలీలియో కాలంనాటికి కచ్చితంగా కాల నిర్ణయం చేసే గడియారాలు లేనప్పటికి ఈయన డోలన కాలాలను గణించటం విశేషం. వైద్య విద్యార్థి కాబట్టి, నాడి కొట్టుకోవటం, గుండె కొట్టుకోవటం పై పరిచయం ఉంది కాబట్టి కాలనిర్ణయాన్ని తేలికగా చేయగలిగాడని అనుకోవచ్చు. ఈ పరిశీలన ఆధారంగా గెలీలియో "పల్స్ మీటరు" రూపొందించాడు. ఆ తదుపరి ఆయన కుమారుడు విన్సెన్జీ గోడ గడియారాన్ని తయారు చేశాడు. మనం వాడుతున్న పెండులం క్లాక్ కు కూడా మూలసూత్రం యిదే.
గెలిలియో కూడా ఆనాటి క్రైస్తవ మత పెద్దల ఆగ్రహాన్ని చవిచూశారు.అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి, కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని ప్రమాణం తీసుకున్నారు. ఈ ప్రకటనకు ఆగ్రహం చెందిన చర్చి మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. 1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించినా, తనపై మోపబడిన అభియోగాన్ని రద్దుచేయబడలేదు. ఐతే రెండు సిద్ధాంతాలపై గ్రంథాన్ని రాయడానికి అనుమతి సంపాదించాడు. దీంతో క్రీ.శ.1630 వరకు గెలీలియో నోరు విప్పలేక పోయాడు. అయినా ఆయన తన వాదాలను విడిచి పెట్టలేదు. వాటిని పుస్తక రూపంలో వెలువరించాడు. 1632లో వెలువడిన ఈ " డైలాగ్స్ కాన్సర్నింగ్ ద టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్" అనే గ్రంథం ఐరోపా ఖండంలో సారస్వత వేదాంత గ్రంథానికి ఉదాహరణగా పేర్కొంటారు. నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించాడు. అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను అడ్డుకున్నారు.ఆయనకు జైలు శిక్ష విధించారు.చివరికి ఆయన జైలులోనే తీవ్ర అనారోగ్యంతో మరణించారు.
గెలిలియో టెలిస్కోప్ కనుగొన్నారు.ఆయన శని గ్రహానికున్న వలయాలని పరిశీలించాడు.గురు గ్రహం యొక్క ఉపగ్రహాలలో నాలుగు ఉపగ్రహాల ఉనికిని గుర్తించాడు.శుక్రగ్రహంపై కూడా ఆయన పరిశోధన చేసాడు.సన్ స్పాట్స్ పై పరిశోధన చేసి సరికొత్త విషయాలని కనుగొన్నారు.ఆయనను ఆల్బర్ట్ అయిన్ స్టీన్ ఆధునిక సైన్స్ పితామహుడు అని కీర్తించాడు. కొందరు ఆయనను ఆధునిక ఖగోళ శాస్త్ర పితగా పరిగణిస్తారు.
గెలిలియో 1564 ఫిబ్రవరి 15 న ఇటలీలోని పీసా నగరంలో జన్మించారు. చిన్నప్పుడు మత విశ్వాసాలని ఆచరించినప్పటికినీ,కాలక్రమేణా ఆయన ఆలోచనలు శాస్త్రీయ దృక్పథం వైపు మళ్లా యి.గెలిలియోని కూడా గొప్ప సంఘ సంస్కర్తగా చెప్పవచ్చు.నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్,గాంధీ,అంబేద్కర్ వంటి మహనీయులు పోరాటాలు,ఉద్యమాల ద్వారా సమాజంలో మార్పు తీసురావడానికి కృషి చేయగా,గెలిలియో వంటి వారు ప్రయోగాలు, పరిశోధనల ద్వారా ప్రజల ఆలోచనలలో మార్పు తీసుకువచ్చారు.ఇటువంటి మహానీయులని నిరంతరం స్మరించుకోవాలి.
ఫిబ్రవరి 15 గెలిలియో జయంతి
యమ్. రామ్ ప్రదీప్
9492712836
Comments
Post a Comment