భారత్లోకి రెండు వలసలు
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్ర పరిశోధకుడు డేవిడ్ రీచ్ నేతృత్వంలోని ఒక బృందం 2018 మార్చిలో ఒక అధ్యయనం చేసింది. 'ద జినోమిక్ ఫార్మేషన్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా' అనే శీర్షికతో వెలువడిన ఈ అధ్యయనంలో ఆశ్చర్యపరిచే అంశాలు ఉన్నాయి.గత 10 వేల సంవత్సరాల్లో భారత్లోకి ప్రధానంగా రెండు వలసలు జరిగాయని ఈ అధ్యయనం చెబుతోంది.
తొలుత సుమారు 65 వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి భారతదేశానికి వలస వచ్చారు.
రెండవ వలస నైరుతి ఇరాన్లోని జాగ్రోస్ ప్రాంతంలో మొదలైంది. ఇక్కడి మనుషులు మేకలను మచ్చిక చేసుకొన్నారనేందుకు తగిన ఆధారం ఆ ఊర్లోనే లభించింది. వీరు భారత్కు వలస వచ్చారు. వీరు పశుపోషకులు. క్రీ.పూ.9000, 3000 సంవత్సరాల మధ్య ఈ వలస జరిగి ఉండొచ్చని టోనీ జోసెఫ్ పేర్కొన్నారు. అలా జాగ్రోస్ ప్రాంతం నుంచి వచ్చినవారు ఉపఖండంలో అప్పటికే నివసిస్తున్న తొలి భారతీయులతో (వలసదారులతో) కలిసిపోయారు. వీరిద్దరూ కలిసి సింధూ లోయ నాగరికతను సృష్టించారు.
క్రీ.పూ. 2000 తర్వాత శతాబ్దాల్లో మరో వలసదారుల సమూహం వచ్చింది. అలా వచ్చినవారే ఆర్యులు. యురేషియన్ స్టెప్పీ ప్రాంతం అంటే బహుశా నేటి కజకిస్థాన్ ప్రాంతం నుంచి వీరు వలస వచ్చి ఉండొచ్చు. ప్రారంభ దశలో ఉన్న సంస్కృత భాషను వీళ్లు తమతోపాటు భారత్కు తీసుకొని వచ్చారు. గుర్రాలను మచ్చిక చేసుకోవడం, వాటిని వాడుకోవడంలో వీరికి ప్రావీణ్యం ఉంది . బలి ఇవ్వడం లాంటి సాంస్కృతిక సంప్రదాయాలను వీరు పాటించారు. తొలి దశ హైందవ/వైదిక సంస్కృతికి ఇవే మూలమయ్యాయి. భారత్కు ఈ వలస జరగడానికి వెయ్యేళ్ల ముందు స్టెప్పీ ప్రాంతం నుంచి ఐరోపాకు కూడా ప్రజలు వలస వెళ్లారు. అప్పటికే అక్కడున్న వ్యవసాయదారులతో కలిసిపోవడం లేదా వారి స్థానంలోకి వీరు రావడం జరిగింది. అలా కొత్త సంస్కృతులు ఏర్పడ్డాయి. కొత్త ఇండో-యూరోపియన్ భాషలు వ్యాప్తి చెందాయి.(బిబిసి,30.12.2018)
Comments
Post a Comment